గురుకులాల్లో ఏకరీతి సిబ్బంది నమూనా అమలు చేయాలి
బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని TGARIEA నాయకుల వినతి
హైదరాబాద్, మే 11:
టీజీఎస్డబ్ల్యూఆర్ఈ (TGSWREI) సంస్థలలో ఏకరీతి సాధారణ సిబ్బంది నమూనా అమలు చేసి, 2026 బదిలీలకు ముందు ఖాళీల వివరాలను పారదర్శకంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వ అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఉద్యోగుల సంఘం (TGARIEA) నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు TGARIEA రాష్ట్ర అధ్యక్షుడు అలగోని నర్సింహులు గౌడ్, జనరల్ సెక్రటరీ ఎస్. గణేష్, డిగ్రీ యూనిట్ జనరల్ సెక్రటరీ సత్య శ్రీదేవి ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి కె. శారద గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వెంటనే బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.
కొద్ది మంది బదిలీలను వాయిదా వేయించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా బదిలీలు చేపట్టాలని కోరారు.
వినతిపత్రంలో ప్రీమియర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEs) లో ప్రస్తుతం అమలులో ఉన్న సిబ్బంది వ్యవస్థలో అసమానతలు ఉన్నాయని పేర్కొన్నారు. 2015లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదించిన సిబ్బంది నమూనా ప్రకారం 19 జూనియర్ లెక్చరర్లు, 9 పీజీటీలు మరియు ఒక హిందీ టీజీటీ పోస్టులను మాత్రమే అమలు చేయాలని సూచించారు.
పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రీమియర్ COEs లలో ఒకే విధమైన సిబ్బంది నమూనా లేకపోవడం వల్ల పరిపాలనా సమస్యలు, అసమాన పనిభారం, ఖాళీల ప్రకటనలో గందరగోళం ఏర్పడుతోందని తెలిపారు.
రాబోయే బదిలీ కౌన్సెలింగ్లో ఖాళీలను పూర్తిస్థాయిలో ప్రకటించాలని, 30 జూన్ 2026 నాటికి పదవీ విరమణ పొందే ఉద్యోగుల పోస్టులను కూడా ఖాళీలుగా పరిగణించాలని సంఘం డిమాండ్ చేసింది.
అదేవిధంగా ఒకే చోట 12 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జిల్లా స్థాయిలో బదిలీలు కల్పించాలని సూచించారు .







