సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు


దిశ, మల్హర్( కాళేశ్వరం): త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో పుష్కర ఘాట్ కిక్కిరిసింది. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మూడో రోజున కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్స్ హాలిడేస్ కావడంతో వాహనాల్లో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను క్రమబద్దీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు బైకు పై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు. శనివారం వేకువ జాము నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి ఈదురు గాలులు రావడంతో పుష్కర ఘాట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్దరించే పనిలో జిల్లా అధికార బాసులు నిమగ్నం అయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ అధికారులు తక్షణమే పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్ సరఫరా అందించారు. అర్ధరాత్రి వచ్చిన ఈదురు గాలుల కారణంగా టెంట్లు నేలకూలిపోగా వాటిని సవరించే పనులను అర్ధరాత్రి నుంచి ప్రత్యక్ష్యంగా కలెక్టర్, ఎస్పీలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయన్న సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు శనివారం ఉదయమే ఇద్దరు తమ కాన్వాయిలను పక్కన పెట్టి బైకు పై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టించారు. శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
సరస్వతి పుష్కర స్నానం ఆచరించేందుకు శుక్రవారం వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాత్రి ఇక్కడే భాష చేశారు. కాళేశ్వరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ మహా హారతి క్రతవును ఆస్వాదించారు. శనివారం ఉదయమే కాళేశ్వరములో సరస్వతి ఘాట్లో సోదరుడు మల్లు ప్రసాద్ తో కలిసి పెద్దలకు పిండప్రదానం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుష్కర ఘాట్లో స్నానమాచరించి కాళేశ్వర శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు శాసనసభ్యులు మక్కన్ సింగ్, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సరస్వతి పుష్కరాలు గోదావరి, ప్రాణహిత అలాగే సరస్వతి అంతర్వాహిని మూడు నదుల సంగమం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరాలు కాళేశ్వరంలో అద్భుతంగా జరుగుతున్నాయని పేర్కొంటూ ఈ పవిత్రమైన పుష్కర స్నానాలను ఆచరిస్తూ, సరస్వతి అమ్మవారిని, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వారికి సర్వవిజయాలు సాధిస్తారనే నమ్మకంతో పాటు చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలన్నీ తొలగిపోతాయని, మంచి మనసుతో అమ్మవారిని కోరుకుంటే అన్ని సవ్యంగా, సక్రమంగా జరుగుతాయని నమ్మకం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి రోజు వచ్చి పుష్కరాల కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. మంథని శాసనసభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
తాను రెండో రోజు సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకున్నానని, అమ్మవారిని ముక్తీశ్వర స్వామిని కోరుకొన్నది ఒకటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నదులు సక్రమంగా పారుతూ పాడి పంటలతో తెలంగాణ ప్రభుత్వం విరాజిల్లాలని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మన రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ఈ పవిత్ర పుష్కరాలు సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నానని ఆయన తెలిపారు. సరస్వతీ నది అంతర్వాహిని అయినటువంటి త్రివేణి సంగమంలో ఘనంగా సరస్వతీ పుష్కరాలు నిర్వహించడం ఎంతో సంతోషమని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10 గంటలకు కాళేశ్వరం చేరుకున్న మంత్రి త్రివేణి సంగమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామి రెడ్డి, భూపాలపల్లి, రామగుండం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మక్కన్ సింగ్ లతో పుష్కర స్నానం ఆచరించి సరస్వతి మాతను దర్శించుకున్నారు.
తదుపరి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సరస్వతి పుష్కరాల ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. స్వామి వారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరి పై ఉండాలని ప్రత్యేకంగా ప్రార్ధించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం 11 గంటలకు మంత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో, వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్జెసీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని 108 ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్స్ ని అత్యవసర సేవల కొరకు 5 అంబులెన్స్ ఉంచారు. ఎటువంటి అత్యవసర సేవల కొరకైన ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
1. PHC Kaleshwaram ambulance no : 8712615698
2. VIP Ghat ambulance no : 8712615687
3. Godavari Ghat : 9063449664
4. Main temple ambulance no : 9063449674
5. Bus stand Ghat no : 8712615685
108 District Manager: Naresh
Cell no : 9154269788
సరస్వతి పుష్కరాలు సందర్భంగా కాళేశ్వరం విచ్చేసే భక్తుల వాహనాలకు టోల్గేట్ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వాహనాల నుంచి ఎలాంటి టోల్ గేట్ వసూలు చేయొద్దని ఆయన ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు కాళేశ్వరంలో టోల్ గేట్ చెల్లించొద్దని సూచించారు. వాహనాలు రద్దీ నియంత్రణకు టోల్ గేట్ రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కర స్నానం ఆచరించి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆహ్వానం పలికారు.