ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ.. తప్పకుండా ఆలోచించాల్సిన అంశాలు...
ప్రభుత్వ విద్యా వ్యవస్థ ;
ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలిపశువులు చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది...
కొంత హిస్టరీలో కి వెళ్దాం. 30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు. డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా,కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే... అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి.. దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి. అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు. ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు. కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు. తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది ఉన్నత తరగతుల చదువుతూ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు. అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు. మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు. వారి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.
తర్వాత కథలోకి వెళ్దాం....
కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతుంది. గ్రామాల్లోని విద్యార్థులు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది. కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ జాయిన్ చేయడానికి అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు కొందరు. దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా? ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు. మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ? ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది. అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా నేను పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది. కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు. కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోతుంది .కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు. ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది. అపార్ట్ మెంట్ లో నడుస్తున్న విద్యా ప్రమాణాలు పాటించకున్నా ప్రభుత్వం తన మీద భారం లేదు కదా అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది.
మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..?
వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది?
దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం...
ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి... ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు.
ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని రూల్ ఏమి పెట్టలేదు. అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది.
కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు. ప్రభుత్వం మీద భారం లేదు ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు. ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే.
అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు. అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది.
ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది. కష్టం చేసుకునే ప్రజల పిల్లలు ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు ఏ మాత్రము చదువు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు. వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి తీసుకెళ్లిపోయారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది. ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి చెట్టు మొదలు కి నీరు పోసినట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది.
ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది.
1. సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం
2. విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా లేకపోవడం.
3. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం
4. ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్లో రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం.
5. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం..
ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏ విధంగా సిలబస్ లేకపోవడం.
ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీ లో చదివి లెక్కలు, ఫిజిక్స్ ,కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా?
రాదు... ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు , అంతకుమించి అంశాలను ఆ ఎక్షామ్ లో ప్రశ్నించడం వలన... అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్లో రూపొందించి లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది?
అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సరిపోవా? అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది...
ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.
నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్య తగ్గట్టు స్కూళ్లను, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?
ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూల్లో ఎందుకు బలోపేతం కావు..
ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే... ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి.
నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు..
ఎడారిలో పండించండి...
మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు. వాటిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు .నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు. నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటాడు. వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు. ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం కేటాయించగల గలవారై ఉంటారు. ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.
మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు.. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీలు పిల్లలు... అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి.. ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి... పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి.. ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి.. పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు..
నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.
మేము చేర్చుకుంటాం...
మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు..
మేము రానిస్తాం...
మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు..
మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు..
మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.
మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు..
మీ పాఠశాల ను శుభ్రం చేసే మనుషులు ఉంటారు.
మాకు మా విద్యార్థులు మేమే ఆ పని.
మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు.
ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.
మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం.
మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు.
మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే...
మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులును మీరే దాచుకుంటారు. ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు. ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వంద మందిని ఆకర్షించాలిగా..
మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం..
మీరు కొన్ని వందల పాఠశాలల బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు...
మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప...
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి... అవన్నీ మీకు కూడా తెలుసు... వ్యవస్థలో లోపాలు సరి చేయి కుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని మాట్లాడుతున్నా గ అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి.
అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు.. లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షల గుంజేస్తుంటే ఏ వందమంది కో సీట్లు వస్తున్నాయి... మరి మిగతా వాళ్ల సంగతేంటి.
మా ప్రభుత్వ పాఠశాలలో పది కి పది పాయింట్లు వచ్చిన వారిని నీ లాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు పక్క కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా..
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది.
ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టుంది.. అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.
దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.