Search This Blog

Thursday, April 21, 2016

అటవీ కళాశాలకు 118 పోస్టులు

హైదరాబాద్ : మెదక్ జిల్లాలో నెలకొల్పబోయే అటవీ కళాశాల నిర్వహణకోసం అవసరమైన 118 పోస్టులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 180 గురుకులాలను రానున్న విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని, ఇందులో ఇప్పటిదాకా అసలు రెసిడెన్షియల్ స్కూళ్లే లేని 32 నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో హార్టికల్చర్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ విద్యాసంస్థలపై వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. హార్టికల్చర్ వర్సిటీ సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభమయ్యే విద్యాసంవత్సరం నుంచే ఫారెస్ట్ కాలేజీ ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు.

కొత్త భవనం నిర్మించేలోపు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తరగతులు నిర్వహించాలని సూచించారు. హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ భవనాల నమూనాలను సీఎంకు అధికారులు చూపించగా.. ఫారెస్ట్ కాలేజీ డిజైన్‌కు సీఎం ఆమోదం తెలిపారు. హార్టికల్చర్ వర్సిటీ డిజైన్‌కు కొన్ని మార్పులు సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉద్యానవనాల సాగుకోసం దళిత రైతులను ప్రోత్సహించాలని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావు, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ తదితరులు పాల్గొన్నారు.

32 నియోజకవర్గాలకు ప్రాధాన్యం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రారంభించతలపెట్టిన 180 రెసిడెన్షియల్ విద్యాసంస్థలను వచ్చే విద్యాసంవత్సరంనుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేసే సమయంలో ఇప్పటివరకూ అసలు రెసిడెన్షియల్ స్కూళ్లు లేని 32 నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని 
సూచించారు. నిన్న క్యాంపు కార్యాలయంలో కొత్త రెసిడెన్షియల్ విద్యాసంస్థలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భవిష్యత్ అంతా విద్య మీద ఆధారపడే ఉంటుంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలని అధికారులకు చెప్పారు. నూతనంగా ప్రారంభమయ్యే విద్యాసంవత్సరం నుంచే రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటుకు, కొత్త భవనాలు నిర్మించడానికి అనువైన స్థలాలు చూడాలని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో, ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న చోట్ల వీటిని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లతో సమావేశమై స్థలాలు నిర్ణయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మండల కేంద్రాల్లోనే విద్యాసంస్థలు ఉండాలనే నిబంధన ఏమీలేదని, విద్యార్థులకు అనువైన స్థలం, ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని సీఎం చెప్పారు. మైనార్టీలకు ఇప్పటికే ప్రకటించిన 70 రెసిడెన్షియల్ విద్యాసంస్థలతోపాటు ఎస్సీలకు 130, ఎస్టీలకు 50 మొత్తం 250 రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభం కావాలని, ఇవన్నీ కేజీ టూ పీజీ విద్యలో భాగం కావాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
గురుకులాలు లేని 32 నియోజకవర్గాలు
గ్రామీణ ప్రాంతాల్లో 22 అసెంబ్లీ స్థానాలు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పది నియోజకవర్గాల పరిధిలో రెసిడెన్షియల్ స్కూళ్లు లేవని రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం గురుకుల పాఠశాలలు లేని నియోజకవర్గాలు ఇవి: 
మహేశ్వరం, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, హుజూరాబాద్, కోరుట్ల, జగిత్యాల, కొల్లాపూర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, మునుగోడు, కొడంగల్, మక్తల్, బోధన్, పినపాక, భద్రాచలం, ఇల్లందు, ముషీరాబాద్, అంబర్‌పేట్, నాంపల్లి, మలక్‌పేట్. హైదరాబాద్‌లోని మరో 10 నియోజక వర్గాలు.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top