లక్షమందికి పైగా రాసే జాతీయస్థాయి పరీక్ష... సీఏ-సీపీటీ. 30 నుంచి 40 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యే ఈ పరీక్షలో చిత్తూరు జిల్లా రైతు కుటుంబానికి చెందిన శ్రీలక్ష్మి అత్యధిక మార్కులు సాధించింది. తన సన్నద్ధత ఎలా సాగిందో... ఆమె మాటల్లోనే!
తంబల్లపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదివి, 9.8 జీపీఏ తెచ్చుకున్నాను. ఇంటర్మీడియట్ను మదనపల్లిలో కృష్ణారెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో చదివాను. నా లక్ష్యానికి అనుగుణంగా ఎంఈసీ గ్రూపు తీసుకున్నాను. 974 మార్కులు వచ్చాయి. గుంటూరు ‘మాస్టర్మైండ్స్’ సంస్థలో ఆర్నెల్లు సీపీటీ శిక్షణ తీసుకున్నాను. చివరి రెండు నెలలూ స్టడీ అవర్స్తో పాటు పరీక్షలు ఉండేవి. అసలు పరీక్షకు ముందు మాక్ టెస్టులు నాలుగు రాశాను.
సీపీటీ పేపర్-1లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ (60 మార్కులు), మర్కంటైల్ లాస్ (40 మార్కులు), పేపర్-2లో జనరల్ ఎకనామిక్స్ (40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు) ఉంటాయి.
మాక్ టెస్టుల్లో ప్రశ్నలు కఠినంగా ఇచ్చేవారు. క్లిష్టమైన ప్రశ్నపత్రం ఇచ్చినా తడబడకుండా బాగా రాయడం కోసం ఇలా చేసేవారు. నా మార్కులు 180 నుంచి 185 వరకూ క్రమంగా మెరుగుపడుతూ వచ్చాయి. సీపీటీ దశలో ఏ విద్యార్థికైనా పరీక్షలు రాశాక, చేసిన పొరపాట్లను వివరించి సరిచేసుకోవటానికి తగిన మార్గదర్శకత్వం అవసరం. అది నాకు అభించింది.
సిలబస్ పూర్తయి, మాక్ టెస్టులు రాశాక అఖిలభారత స్థాయిలో ర్యాంకురావొచ్చని కాస్త నమ్మకం ఏర్పడింది. కిందటి ఏడాది డిసెంబరు 13న పరీక్ష రాశాను. కఠినమైన పరీక్ష రాయటానికి సంసిద్ధమైవుండటం వల్ల సీపీటీ సులువుగానే ఉందనిపించింది. జనవరి 17న ఫలితాలు వచ్చేశాయి. అనుకున్నట్టుగానే మార్కులు సాధించటం సంతోషం కలిగించింది.
తాత్సారం వద్దు
* సీపీటీ రాసేవారు కష్టపడి చదవటం చాలా అవసరం.
* గరిష్ఠసంఖ్యలో పునశ్చరణలు (రివిజన్లు) చేయటం మంచిది.
* చివరి రోజుల్లో హడావుడిగా సిలబస్ పూర్తిచేయాలనే ఆలోచన ఏమాత్రం సరి కాదు. అప్పుడు జరిగే సన్నద్ధత ఏమాత్రం ఫలితాన్నివ్వదు.
* మొదటినుంచీ క్రమం తప్పకుండా కాన్సెప్టులు అర్థం చేసుకుంటూ చదవటం అవసరం.
* తరగతుల్లో పాఠాలను ఏకాగ్రతతో వినాలి. ఏమైనా సందేహాలొస్తే ఎప్పటికప్పుడు అధ్యాపకులను అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలి.
* అకౌంటింగ్ లోతుగా అధ్యయనం చేయాలి. సబ్జెక్టు బాగా నేర్చుకుంటేనే బిట్లు ఏ మూలనుంచి వచ్చినా జవాబులు గుర్తించగలుగుతారు. అందుకే ప్రతి వాక్యమూ శ్రద్ధగా చదవాల్సిందే.
* థియరీ కాబట్టి మర్కంటైల్ లాస్ ఎక్కువసార్లు చదవాలి. లేకపోతే గుర్తుండదు.
* ఎకనమిక్స్ ప్రాథమికాంశాలను (బేసిక్స్), భావనలను (కాన్సెప్ట్స్) నేర్చుకోవటం ముఖ్యం.
* క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఫార్ములాలు ప్రధానం. దీనికి సాధన చాలా అవసరం.
* సీపీటీలో సమయ నిర్వహణ చాలా కీలకమైన అంశం. ఉన్న వ్యవధిని సక్రమంగా వినియోగించుకోవాలి. వీటన్నిటినీ పాటిస్తే సీపీటీలో ఆశించిన విజయం దక్కించుకోవచ్చు!
గరిష్ఠసంఖ్యలో పునశ్చరణలు చేయటం మంచిది. చివరి రోజుల్లో హడావుడిగా సిలబస్ పూర్తిచేయాలనే ఆలోచన ఏమాత్రం సరి కాదు. అప్పుడు జరిగే సన్నద్ధత ఏమాత్రం ఫలితాన్నివ్వదు. మొదటినుంచీ క్రమం తప్పకుండా కాన్సెప్టులు అర్థం చేసుకుంటూ చదవాలి